సాక్షి,ముంబయి: రైతు రుణ మాఫీ అమలుకు మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆన్లైన్ రిజిస్ర్టేషన్ ప్రక్రియ అదికారులకు చుక్కలు చూపుతోంది. రుణమాఫీ దరఖాస్తుల్లో దాదాపు 100 మందికి పైగా రైతులు ఒకే ఆధార్ నెంబర్తో లింక్ కావడాన్ని అధికారులు గుర్తించారు. రుణ మాఫీ కోసం తమ ఆధార్ నెంబర్తో రైతులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. రుణ మాఫీ ప్రయోజనాన్నిఅనర్హులు, నకిలీలు పొందకుండా నివారించేందుకు ఆధార్ లింకింగ్ ఉపకరిస్తుందని ప్రభుత్వం ఊదరగొట్టింది. అయితే ఇప్పుడు ఒక ఆధార్ నెంబర్కు వందకు పైగా రైతులు అనుసంధానం కావడంతో అధికార యంత్రాంగం మైండ్ బ్లాంక్ కావడంతో పాటు ప్రతిష్టాత్మక కార్యక్రమం కాస్తా రైతుల నుంచీ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఆన్లైన పోర్టల్ జాబితలో కొందరి రైతుల పేర్లు తారుమారు కావడం కూడా అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. పలువురు రైతులు ఒకే ఆధార్ నెంబర్ను చూపడంతోనే ఈ సమస్య ఎదురైందని సీనియర్ అధికారులు చెబుతున్నారు. రైతుల వద్దకే వెళ్లి అన్నీ చెక్ చేయాలంటే కొద్ది వారాల సమయం పడుతుందనే ఆన్లైన్ ప్రక్రియ చేపట్టామని వారన్నారు. రుణ మాఫీ అమలులో జాప్యం పట్ల రైతులు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మరికొన్ని ఉదంతాలు చూస్తే రైతులు తీసుకున్న మొత్తానికి, వడ్డీకి సరిపోవడం లేదని ఇది పలు అనుమానాలకు తావిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి..మరోవైపు రుణ మాఫీ అమలుకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, ఇతర అడ్డంకులను అధిగమించేందుకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బ్యాంకర్లు, అధికారులతో భేటీ అయ్యారు.